శ్రీ రామ నవమి ప్రాముఖ్యత
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
💠 శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత 💠
శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు .
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.
ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలం యందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.
రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ-జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర, సుమధుర, చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు.
శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు.
సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం.
శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడ గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి.
భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టభిషేకం రామునికి జరిగింది.
కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేకం సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు.
శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు.
ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.
పానకం, వడపప్పు :-
శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను బెల్లం పానకం ... పెసర వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చినా, తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకూ పానకం ... వడపప్పును పంచడం వెనుక పరమార్థం లేకపోలేదు. శ్రీ రామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటికి ఎక్కువగా పోవడం వలన నీరసం రావడం జరుగుతుంది.
ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం ... పెసర బేడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. బెల్లం పానకం ... పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని... పోషకాలను అందిస్తూ ఉంటాయి.
జీర్ణ సంబంధమైన ... మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత .. పిత్త ... కఫ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి. అందువలన బెల్లం పానకం ... వడపప్పే గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వలన సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్య పరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పొచ్చు.
మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా ఋతువులను,దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతువ్యాధులకు… పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది.
పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ దెబ్బ’ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .
శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.
శ్రీరామ ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.
సీతాదేవి ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...
ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.
🙏 || జై శ్రీ రామ్ || 🙏
✍️ “ సాంప్రదాయం “
No comments:
Post a Comment