హనుమంతుడు
హనుమ స్తోత్రం :-
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ |
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||
బుద్ధిర్బలం యశొధైర్యం నిర్భయత్వ-మరోగతా |
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్-స్మరణాద్-భవేత్ ||
హనుమంతుడు సీతారాములకు దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు,హనుమాన్, భజరంగబలి, మారుతి, అంజని సుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.
వానరజాతి
ప్రాచీన కాలంలో వానర జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాలు , పురాణాలు చదువుకొన్న మహా పండితులు కూడా ఉండేవారు. మనషులకు మించిన శక్తి యుక్తులు వారి సొంతం. వారికి ప్రత్యేకత ఏమంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులయినా మేధస్సులో మనుషులకు తీసిపోని జాతి అది.
వివిధ గాధలు
హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాధలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాధలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాధ క్లుప్తంగా ఇవ్వబడింది.
జననం, బాల్యం
పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు. అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు. మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాల్లో కెల్ల శ్రేష్టమైనది.శంబసాదనుడనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాలుకు భంగం చేస్తూ దేవ ఋషులను హింసించేవాడు. దేవ ఋషులు బలవంతుడిగా పేరుబడ్డ కేసరిని పిలిచి శంబసాదనుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తారు. మునులకోరికపై శంబసాదనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవ ఋషులకు పీడ తొలిగిస్తాడు. సజ్జన స్వభావం గల అతనికి అంజన అనే భార్య ఉంది. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజన కొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు.
జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధం తో ఆ బాలునిదవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.
ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.
వజ్ర ఘాతం
ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలి పెట్టి పళ్ళు తీసుకొని రావడానికై అడవికి వెడుతుంది అతని తల్లి. ఆకలి వేసి మెలుకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరుచేసరికి ఎదురుగా ఎర్రని సూర్య బింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగా భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారి ఆకాశం పైకి ఎగురుతాడు. రివ్వుమని వాయు మనో వేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని దేవతలు , మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతనిచుట్టూ చల్లబరుస్తుంది. సూర్యుడు కూడా ఒక్క సారిగా తనవైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడయిన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తరవీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకొన్నాడు. ఆరోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడ్ఫి పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తునాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెల పోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వెంటనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతూన్న ఆంజనేయుడిని చూసాడు. వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోబోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహం పైకి విసిరాడు. ఆ వజ్రాయుధఘాతానికి ఆంజనేయుడి ఎడమ చంపకు బాగా నొప్పికలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతం పై పడిపోతాడు. వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా ఉపసమ్హరించాడు. సకల ప్రాణులు ప్రాణవాయువులేక దేహాలు స్థంబించిపోయాయి. దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మ దేవుడికి వివరించారు. బ్రహ్మ అంజనీ దేవి వద్దకు వారిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆమె బాల హనుమంతుడిని ఒడిలో పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ ఉంది. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాల హనుమను ఒక్క సారి నిమురగానే అతని శరీరం పై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది. బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్ర లోంచి లేచినవాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణులను రక్షించాడు. లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పని చేయడం జరిగింది.
అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు.ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనుమ గాయపడ్డాడు కావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలూ నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించ దన్నాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడూ , ఈశానుడూ, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడవేయలేదని మాటిచ్చాడు. శత్రువులకు భయాన్ని , మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామ రూపం ధరించగలవాడని అని దీవించి దేవతలని వెంటపెట్టుకొని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు.
విద్యాభ్యాసం
హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.
హనుమంతుడు మహా శక్తిమంతుడు బలశాలి అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాలవల్ల కొంటెపిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు. మునుల నారచీరలు చింపివేయడం , అగ్ని హోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు. అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసివస్తుందని అంటారు. అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు ధ్యాస పట్టింది.
గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు.
ఉద్యోగం
విద్యముగిసింది. ఇక ఉద్యోగం వెతుక్కోవాలి. అప్పుడు వానరులకు ఋక్షరజనుడు రాజై కిష్కంధను రాజధానిగా చేసుకొని పాలించేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు. వాలి, సుగ్రీవులు. వాలి రాజైన తరువాత సుగ్రీవునికి ఆంతరంగికుడుగా ఆంజనేయుడు పనికి కుదిరాడు.
వాలి సుగ్రీవులకు వైరం
వాలి మహాబలసంపన్నుడు. రావణాసురుడంతటి వాడే అతని శక్తి ముందు తలవంచి స్నేహితుడిగా మారిపోయాడు. ఒక సారి మాయావి అనే రాక్షసుడు వాలితో యుద్ధం చేయడానికి కిష్కింధకువచ్చి గలాబా స్రుష్టించాడు. వాలి ,సుగ్రీవులు అతని ముందుకొచ్చారు. వారిని చూడగానే మాయావికి పై ప్రాణాలు పైకి పోయాయి. భయపడి పారిపోయినాడు. వాలి అతన్ని వదలక అనుసరించినాడు. మాయావి ఒక బిలంలోకి దూరి మాయమయ్యాడు. వాలి, సుగ్రీవునితో " నువ్వు ఇక్కడే నాకోసం వేచిఉండు. వాడెక్కడున్నా సరే. వాడిని చంపి గాని తిరిగిరాను. " అని బిలంలోకి దూరాడు. ఏడాది పాటు ఆ బిలం దగ్గరే గడిపాడు. ఇంతలో రాక్షసుల ఆర్తనాదాలు, ఏరులై పారుతూ రక్తం బిలం నుంచి బయటకు వచ్చింది. సుగ్రీవుడు రాక్షసుల చేతిలో చని పోయాడని భావించి వాలిని జయించిన రాక్షసుడు తిరిగి బయటకు వస్తే తమ జాతి మనుగడకే ప్రమాదమని భావించి బిలాన్ని ఒక పెద్ద రాతితో మూసి విచారిస్తూ కిష్కింధకు పోయి జరిగిన సంగతి చెప్పి వాలికి అంత్యక్రియలు చేసాడు. వానర పెద్దలు సుగ్రీవుడిని రాజు చేసారు. కొన్నాళ్ళకు బిలం ముందు ఉన్నరాయిని కాలితో తన్ని కిష్కింధకు వస్తాడు వాలి.అతనికి జరిగిన సంగతి సుగ్రీవుడు చెప్పబోగా వినక తన్ని చంపడానికి సిధ్ధమవుతాడు వాలి. ఇక అక్కడ ఉంటే ప్రమాదమని భావించి సుగ్రీవుడు అరణ్యాలకు పారిపోతాడు. తన జాడ వాలికి తెలిసినప్పుడల్లా వేరే తావుకు పారిపోయి తల దాచుకొనేవాడు అతనికి కష్టకాలంలో ఉన్న నలుగురు మంత్రులలో హనుమంతుడు ఒకడు.
హనుమంతుడి మంత్రిత్వం
నిజానికి వాలి కంటే హనుమంతుడు బలవంతుడు. మునుల శాపం వల్ల తన బలం గుర్తురానందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవులలోకి పారిపోవలసి వచ్చింది. ప్రతీ రోజు ప్రాణ భయంతో విలపిస్తున్న సుగ్రీవుడితో ఒక రోజు ఇలా అన్నాడు" మీ అన్న ఒక సారి దుందుభి అన్న రాక్షసుడిని చంపాడు. వాలి అతన్ని ఎత్తి పడవేయగా ఋష్యశృంగ పర్వతం మీద తపస్సు చేస్తున్న మాతంగ మహర్షి మీద ఆ కళేబరం పడింది. కోపంతో మాతంగ ముని ఈ పర్వతానికి వాలి వస్తే తలపగిలిచస్తావని శపించాడు. మీ అన్న అక్కడకు రాడు. మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం" అని.సుగ్రీవుడికి ఆ సలహా నచ్చింది. హనుమంతుడిని మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగాడు.
రామ లక్ష్మణులతో స్నేహం
రామ లక్ష్మణులు అడవిలో ఉంటుండగా సీతను రావణుడు అపహరించుకొని లంకకు తీసుకొనిపోతాడు. ఆమె జాడకై వెతుకుతూ వారు ఆ పర్వతాన్ని చేరుకొంటారు. వారిని చూసి వాలి తనకోసం ఇద్దరు వీరులను పంపించాడని భావించి హనుమంతుడిని వెళ్ళి సంగతి కనుక్కోమని కోరాడు.
హనుమంతుడు బిక్షువుగా రూపం మార్చుకొని రామలక్ష్మణులకు అతిధి పూజ చేసి " అయ్యా! మీరు మహాపురుషులని చూస్తేనే తెలుస్తుంది ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణం ఏమిటి? నేను సుగ్రీవుడి మంత్రిని. వానరుడిని. కామరూప విద్య తెలిసినవాడిని కావటాన ఈ రూపంలోకి మారాను." అందుకు రాముడు" చూసావా లక్ష్మణా! మనమే సుగ్రీవుని కలవాలని భావించాం. అతని దూత మన వద్దకు వచ్చాడు. ఇతడి సంభాషణలో ఒక్క అపశ్రుతీ లేదు. మహా వ్యాకరణ పండితుడని తెలుస్తుంది. ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు. " అని మెచ్చుకొని తన వృత్తాంతం అంతా చెప్పాడు.
అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరినీ తీసుకొని సుగ్రీవునికి పరిచయం చేసాడు. సీతాన్వేషణలో తాము సాయం అందించటానికి అలాగే వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసే విషయంలో రాముడు సహకరించడానికి ఒప్పందం చేసుకొని అగ్ని సాక్షిగా సుగ్రీవుడు ,రాముడు స్నేహితులయ్యారు. అనతి కాలంలోనే రాముడు వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసాడు. రాజయిన తరువాత సుగ్రీవుడు భోగాలను రుచి చూసి రాముడికిచ్చిన మాటను మరచిపోగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి హెచ్చరించాడు. అప్పుడు సుగ్రీవుడు వానర వీరులను చేర పిలిచి ఒకొక్కరినీ ఒకొక్క గుంపుకు నాయకుడిని చేసి ఒకొక్క దిక్కుకు పంపుతూ కొందరు వానర వీరులతో హనుమంతుడిని దక్షిణ దిక్కుకు పంపాడు. నెల రోజుల గడువులో సీత జాడ కనుగొనాలని షరతు విధిస్తాడు.
హనుమంతుడి దళంలో అంగదడుకూడా ఉన్నాడు. అంగదుడు కిష్కింధకు యువరాజు. అలా వెళ్ళిన వారు చెట్టులు పుట్టలు అడవులు కొండలు గాలిస్తూ అలసిపోయారు. సుగ్రీవుడు పెట్టిన గడువు నెల రోజులు ఇట్టే అయిపోయాయి. కానీ వారికి సీత జాడమాత్రం తెలియలేదు. ఆకలిదప్పులతో కదలలేని స్థితికి చేరుకొన్నారు.
స్వయంప్రభా దర్శనం
అలసి పోయి ఉన్న వారికి ఒక బిలం కనిపిస్తుంది , ఆ బిలంలో నుండి వస్తున్న హంసలు మొదలైన పక్షులు కనిపించాయి. పక్షులొస్తున్నాయి గనక నీరు చెట్లు సమృధ్ధిగా ఉండే చోటు అని ఊహించి అంతా బిల మార్గంలో ప్రవేశించి వెళ్లారు. యోజనం పైగా నడిచినా వారికి అక్కడ ఏమీ కనపడక ప్రాణాలు కడగంటే స్థితికి వచ్చారు. అలా దీనంగా ఉన్న వేళ వారికి ఒక అద్భుతమైన పూల గుత్తెలు, విమానాలు, బంగారు సోపానాలు కలిగిన మణిమయ మండపాలు స్వర్ణ వర్ణంతో ఉన్న తాబేళ్ళు చేపలు, నిర్మలమైన నీరు, పళ్ళు ఉన్న స్థలం కనిపించింది. అక్కడ అగ్నిలా ప్రకాశిస్తున్న ఒక తపస్విని ఉన్నది. హనుమంతుడు ఆమెకు చేతులెత్తి నమస్కరించి తమ వృత్తాంతం చెప్పుకొన్నాడు. ఆమె వారికి అతిధ్యం ఇచ్చి.తన పేరు స్వయం ప్రభ అని హేమ స్నేహితురాలినని ఇది విశ్వకర్మ నిర్మించిన ప్రదేశమని, ఇక్కడకు వచ్చిన వారు తిరిగి పోలేరని చెప్పి వానరులపై దయతో బిలం దాటించి వారికి పరిసరాల వివరాలు తెలిపి జాగ్రత్తలు చెప్పింది. వారు బయటకు వచ్చి సీతను చెప్పిన గడవులో వెతికి గుర్తించలేందుకు చండశాసనుడైన సుగ్రీవుడు మరణ దండన విధించి తీరుతాడు గనక ఇలా ఆకలి దప్పులతో మరణించడమే మంచిదనిపించింది. వానర మూకను సంపాతి అనే పక్షి గమనించి చాలా కాలానికి తనకు ఆహారం సమృధ్ధిగా దొరికిందని వారితో అని భక్షించడానికి పూనుకొన్నది. అప్పుడు అంగదుడు హనుమతో" చూసావా హనుమా! జటాయువులా మనకు దురదృష్టకరమయిన మరణం రాసిపెట్టి ఉన్నది." అన్నాడు. సంపాతికి జటాయువు సోదరుడు. సంపాతి వారితో" ఓయీ! జటాయువును నీవు ఎరుగుదువా?" అని ఆసక్తిగా అడిగింది. అప్పుడు హనుమ సీతాన్వేషణం దాకా మొత్తం కథను చెప్పాడు. అది విని సంపాతి" నాయనా! జటాయువు నా సోదరుడు. అతని మరణానికి కారణమైన రావణుడిపై వృధ్ధుడనై, సూర్యతాపం వలన రెక్కలు కాలినందున పగ తీర్చుకొనలేను.కానీ నాకు యోజనాల దూరం ఇక్కడనుంచే చూసే శక్తి ఉన్నది. సీత సముద్రానికి ఆవల విషణ్ణవదనయై లంకానగరంలోని అశోక వృక్షం కింద భర్తకోసం విలపిస్తున్నది. సముద్రాన్ని దాటి వెళ్ళి ఆమెను రక్షించండి " అన్నాడు.
ఇక నూరు యోజనాల విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తతింది. చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడనీ, తన శక్తి తనకు తెలియదు గనుక హనుమంతుడు మౌనంగా ఉన్నాడనీ చెప్పాడు. ఆ ఆపదనుండి అందరినీ కాపాడడానికి హనుమంతునకే సాధ్యమని చెప్పాడు.
హనుమంతుడు పర్వకాల సముద్రం లా పొంగిపోయాడు. వంద ఆమడల వారాశి ని గోష్పదం లా దాటేస్తాననీ, సీతను చూచి వస్తాననీ అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకి ఎక్కాడు.
సుందర కాండ
హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండ లో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండ లో అనేక శ్లోకాలు ప్రార్ధనా శ్లోకాలుగా వాడుతారు.
హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరి పై నుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి,సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.
చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు.
రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనం లో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపం వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.
అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. రెండు నెలలు మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.
వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.
ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తనచూడామణి ని ఆనవాలుగా ఇచ్చినది. రెండు నెలలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తువేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
యుద్ధ కాండ
హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. లంకానగరం స్వరూపాన్ని, భద్రత ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాడు.
శరణు జొచ్చిన విభీషణుని మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపి సేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.
వానరవీరులకు, రాక్షస సేనకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేకమంది రాక్షసులుహనుమంతుని చేతిలో మరణించారు. అలా హనుమ చేత నిహతులైన రాక్షసులలో ధూమ్రాక్షుడు, అకంపనుడు,దేవాంతకుడు, త్రిశిరుడు, నికుంభుడు వంటి మహావీరులున్నారు.
రావణుని శక్తితో మూర్ఛిల్లిన లక్ష్మణుని హనుమంతుడు జాగ్రత్తగా ప్రక్కకు తీసికొని వచ్చాడు. తరువాత రాముడుహనుమంతుని భుజాలమీద ఎక్కి రావణునితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలా మంది వానరులు హతులయ్యారు. రామ లక్ష్మణులు, మిగిలిన వానరసేన వివశులయ్యారు. వారిని విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది సంజీవని ఓషధులను తీసుకు రమ్మని హనుమను కోరాడు.
జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, మిగిలిన వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.
తరువాతి యుద్ధంలో లక్ష్మణుని చేతి లో ఇంద్రజిత్తు మరణించాడు. మరునాటి యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. రాముడు దుఃఖితుడయ్యాడు. సుషేణుని కోరికపై హనుమంతుడు మరలా హిమాలయాలలో ఉన్న ఓషధుల పర్వతం సంజీవని ని తీసుకొని రాగా ఆ ఓషధులను ప్రయోగించి సుషేణుడు లక్ష్మణుని స్వస్థునిగా చేశాడు.
ఆపై జరిగిన భీకర సంగ్రామంలో రామునిచేత రావణుడు అంతమయ్యాడు. యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయ వార్త చెప్పాడు. సీత అగ్ని ప్రవేశానంతరం సీతారామలక్ష్మణులు అయోధ్యకు వచ్చారు. వైభవంగా పట్టాభిషేకం జరిగింది.
శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారం తో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. తరువాత హనుమంతుడు ఆ దండను పిచ్చి దండలా తుంచి వేసెను. సభలోని వారందరూ ఆశ్చర్యపోయిరి. లక్ష్మణునికి కోపము వచ్చినది. ఆంజనేయా! నీవు ఏమి చేయుచుంటివి అని ప్రశ్నించెను. హనుమంతుడు మాత్రం "శ్రీరాముడు లేని ఈ దండ నాకు అనవసరం" అని పలికెను. అప్పుడు లక్ష్మణుడు మరింత కోపోద్రిక్తుడై "శ్రీరాముడు నీలో ఉన్నాడా?" అని ప్రశ్నించెను.అప్పుడు హనుమ తన హృదయ పలకంలో కొలువైన శ్రీ సీతారాములను చూపించెను.హనుమ రామ భక్తి చూసి అందరూ పరవశులైనారు.
🙏 జై శ్రీ రామ్ 🙏
✍️ " సాంప్రదాయం "