Tuesday 14 August 2018

శ్రావణ మాసం



                            శ్రావణ మాసం

పండుగలకు గృహ శోభ కి విశేష మాసం


*సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే*              
*శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే*

తాత్పర్యము:-

*మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై,సర్వ మంగళ నామధేయురాలవై,అన్ని అర్థములను సాధించి,శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే,ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ,ఓ! దుర్గాదేవీ,ఓ! నారాయణీ..నీకు నమస్కరిస్తున్నాను.*

శ్రావణ మాస విశిష్టత ......

వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమే. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పూర్వీకుల ఉవాచ. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మానం ఇదే.

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.

శ్రావణ సోమవారం……



శివారాధనకు ఎంతో విశిష్టత కలిగిన మాసం..
శ్రావణమాసంలోని దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు కూడా విశిష్టమైన మాసం. శ్రావణమాసం ముఖ్యంగా భగవారాధనలో శివ, కేశవ బేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ మాసంలో చేసే ఏ చిన్న కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుంది. ఈ మాసంలో సోమవారాలు పగలంత ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రభిషేకాలు, బిల్వార్చనలు జరిపినట్లయితే సకల పాపాలు కూడా నశిస్తాయాని శస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా ఉపవాసం ఉండి దీక్షను పూర్తిచేయాలి. అలా సాధ్యం కానీ పక్షంలో రాత్రి సమయంలో పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని బుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనేక శుభఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణశుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఈ పక్షంలోని ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్ర్తాలు చెబుతున్నాయి. భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉటుందంటున్నారు పండితులు. అందుకే శ్రావణమాసంలోని అన్ని సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది.

శ్రావణ మంగళవారం - మంగళగౌరీ వ్రతం…...



కొత్త పెళ్లికూతురు శ్రావణమాసంలో వచ్చే ప్రతిమంగళవారం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. మంగళగౌరీ అనుగ్రహం తో అష్టైశ్వర్యాలు, నిండు ముత్తెదుతనం పొందుతారు.
శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.

శ్రావణ శుక్రవారం - ‌వరలక్ష్మీ వ్రతం…...



ఈ మాసం లో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని పెద్దలు చెప్పారు. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం
శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాని పటించాలి.

శ్లో: బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం |
పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే ||

అని పటిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పటిస్తూనే ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి..

శ్రావణ శనివారాలు…...



ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పౌర్ణమి…...




శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి .
జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.

నాగుల చవితి…...




నాగుల చవితి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్ధి ని నాగదేవతలకు ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం, నాగ దేవతలకు పాలు పోస్తే సంతానానికి సంబంధించిన దోషాలు అన్ని తొలుగుతాయి. సర్పదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

నాగపంచమి…...




శ్రావణ పౌర్ణిమకు ముందుగా వచ్చే పంచమిని నాగపంచమి అంటారు. ఈరోజున ఉదయాన్నే లేచి పాముపుట్టల వద్దకు వెళ్లి ఆ నాగేంద్రునికి పాలు పోస్తారు.


శ్రీ సంతోషిమాతా వ్రతం…...




శ్రావణ పూర్ణిమ రోజుని శ్రీ సంతోషీ మాతా జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున సంతోషిమాతా వ్రతం చేయటం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని నమ్మకం. శ్రీ సంతోషిమాతా వ్రతాన్ని ఆచరించడం ద్వారా అన్నిశుభాలు కలుగుతాయని, ధన, కనక, వస్తు, వాహన యోగంతో పాటు నిండు ముతైదుతనం లభిస్తుందని మహిళలు భావిస్తారు. .

రక్షా బంధనం…….




శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. మహిళలు తమ అన్నదమ్ములకు, సోదర సమానులకు రాఖీని కట్టి వారి క్షేమం కోరుకుంటారు. శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండి వస్తున్నా సంప్రదాయమేనని తెలుస్తోంది.

హయగ్రీవ జయంతి…...




శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవ జయంతి అని పురాణాల్లో ఉంది. ఈ రోజు విష్ణు ప్రీతిగా చేసే అర్చన, ఆరాధన, వ్రతాలు, విశేష ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ రోజున హయగ్రీవుల వారి ద్వారా ఉపదేశించిన శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి గుగ్గిళ్లు నైవేద్యం పెట్టటం మంచిది. మనలో ఉండే అహంకారం తొలగిపోయి అందరిలో సమ భావన కలిగి ఉంటారు.


శ్రీ కృష్ణాష్టమి…...




ఈమాసంలోనే శ్రీకృష్ణ జన్మాష్టమి. అందరూ ఎంతో భక్తిశ్రద్దలతో శ్రీకృష్ణుని పూజించి, చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణలు ధరించి ఉట్టికొట్టి ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు.

మతత్రయ ఏకాదశి…...




శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు  మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెపుతున్నాయి.

శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు కూడా ఈ మాసంలోనే ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.

పొలాల అమావాస్య …...



ఈ వ్రతం శ్రావణ మాసం చివరి రోజున చేసుకుంటారు.ఇది పెళ్ళయిన ఆడవాళ్ళుపిల్లల(శ్రేయస్సు)కోసంచేస్తారు శ్రావణ మాసం చివరగా వొచ్చే అమావాస్యరోజున జరుపుకుంటారు.పండగపూట కందమొక్కకు పూజ చేస్తారు.  

ఇన్ని పండుగలు అన్ని ఈ మాసంలోనే వస్తాయి కాబట్టి శ్రావణమాసం అంటే సందడే సందడి. మనశక్తి ని బట్టి భక్తితో,మనసులో, మనస్పూర్తిగా ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ… వీలైనన్ని పూజలు చేసుకుని ఆ లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది, అమ్మ ఆశీస్సులతో సకల సౌభాగ్యాలు పొందుదాము.

శ్రావణ లక్ష్మి - సౌభాగ్యదాయిని……



పుణ్యాల రాశి... సర్వజగత్తుకూ కల్పవల్లి... దారిద్య్ర వినాశిని... సౌభాగ్యదాయిని...పాలకడలిలో పుట్టిన దీపశిఖ...శ్రీమహాలక్ష్మి... లోకాలన్నిటికీ సర్వ శుభాలనూ చేకూర్చే ఆ తల్లి ఎవరింట ఉంటుందో ఆ ఇంట్లో తానూ ఉంటానని పరమాత్ముడు చెప్పారు. సిరి,హరి కలిసి ఉన్న ఆ ఇంట్లో లేనిదేముంటుంది. మరి సిరి ఎక్కడుంటుంది? సత్కర్మలలో, సదాశయాల్లో, సదాచారాల్లో, నీతినియమాల్లో అమ్మవారు కొలువుంటారని మార్కండేయ పురాణం చెబుతోంది. వ్యసనాలు, సత్ప్రవర్తన, శారీరక, మానసిక శుద్ధి లేని వారింటిని శ్రీమహాలక్ష్మి విడిచిపోతుందని జైమినీ భారతం తెలియజేస్తోంది. అందుకే డబ్బుకన్నా ముందు మంచి గుణగణాలను ఇమ్మని అమ్మను ప్రార్థించాలి.  లక్ష్మీ విభూతుల్లో మనిషి చెమట చిందించే చోటు ప్రముఖమైన లక్ష్మీ స్థానంగా చెప్పారు. అంటే శ్రమే సంపద. శ్రమ జీవికి జగమంతా లక్ష్మీ నివాసమే.

లక్ష్మీదేవి సకల సంపదలకు ప్రతీక. సకల సౌభాగ్యాలకూ చిహ్నం. మనిషి సుఖమైన, శుభప్రదమైన జీవితం గడపడానికి కావాల్సిన సమస్త అంశాలను సంపదగానే పరిగణిస్తారు. ధనధాన్యాలు, సంతానం, ఆరోగ్యం, జ్ఞానం వంటివన్నీ కోరేవారంతా లక్ష్మీకటాక్షం కోసం ఎదురు చూస్తుంటారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి... వగైరా పేర్లతో వారివారి అభీష్టం మేరకు ఆరాధిస్తారు.

లక్ష్మీ స్తోత్రాల్లో ‘దారిద్య్ర ధ్వంసినీం దేవీం సర్వ ఉపద్రవ వారిణీమ్‌’ అని ప్రార్థన ఉంటుంది. లోకంలోని సకల దారిద్య్రాలను పారదోలే దేవత శ్రీ మహాలక్ష్మి. సర్వ ఉపద్రవాలను నివారించగల దేవత ఆమె. అందుకే ఆమెను శంకర భగవత్పాదులు ‘సంపత్కారిణి’ అనీ, ‘త్రిభువన భూతకరీ’(ముల్లోకాలకు ఐశ్వర్యాన్నిచ్చేది) అనీ సంబోధించారు. రుగ్వేదంలోని ప్రధాన సూక్తాల్లో శ్రీసూక్తం దేవీ తత్త్వాన్ని మనకు అందించింది. సృష్టిలోని సంపదల్లో దాగున్న అమ్మ రూపాన్ని అపురూపంగా పదిహేను రుక్కుల్లో మనకు వివరించింది. ఇందులో

పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగోరథమ్‌ |
ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మామ్ ||

పుత్రపౌత్రులు, ధనధాన్యాలు, ఏనుగులు, ఇతర సంపదలను అనుగ్రహించు తల్లీ... నాకు ఆయుర్ధాయాన్ని ప్రసాదించమని అంటోందీ రుక్కు. ఇందులో ఆయుష్షును ప్రత్యేక సంపదగా పేర్కొంటోంది. మిగిలిన సంపదలు అనుభవించాలంటే మొదట ఆయుర్ధాయం కావాలి. దానికి ఆరోగ్యం కావాలి. ఈ సూక్తాన్నిబట్టే ఆరోగ్యమే మహాభాగ్యమని... అది కూడా లక్ష్మీ స్వరూపమని తెలుసుకోవాలి. వనాలు, ఆకులు, సుగంధ ద్రవ్యాలు, ఆవుపేడ, బిల్వ వృక్షం... ఇవన్నీ శ్రీలక్ష్మికి నివాసాలు. అడవులు, నదులు, పర్వతాలు, ప్రకృతిలో ఉన్న అమ్మను ప్రసన్నురాలిని చేసుకోవడమే మన ప్రగతికి శ్రీకారంగా గుర్తించాలి.

ఏమికోరినా  అనుగ్రహించే తల్లి కాబట్టి ఆమెను వరలక్ష్మిగా సంబోధించారు. ‘వ్రతవ్యే అనేన అనయావా అతి వ్రతం...’ జీవితాంతం ఒక దీక్ష మాదిరిగా దేన్ని పాటిస్తామో అది వ్రతం అవుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఒక్కరోజు మాత్రమే నిర్వహించే వరలక్ష్మీ పూజను మన పెద్దలు వ్రతంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.

అమ్మవారు ఫాల్గుణమాసం ఉత్తరానక్షత్రంలో పౌర్ణమివేళ నాలుగు చేతులతో అవతరించారు. అందుకే అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఏటా శ్రావణమాసంలో ప్రతి శుక్రవారాన్ని విశేషమైన పండగగా చేసుకుంటారు. ముఖ్యంగా మహిళాలోకంలో శ్రావణశుక్రవారానికి విశేష ప్రాధాన్యం ఉంది.
సిరులిచ్చే శ్రీలక్ష్మి అనుగ్రహం పొందడానికి పూజలు, వ్రతాలు, స్తోత్రాలు ఉపకరించవచ్చు. వాటికి ఆ తల్లి ఆనందించనూ వచ్చు. అయితే భక్తుడి ఇంట ఎప్పటికీ తానుండాలంటే మరికొన్ని నియమాలను కూడా పాటించాలని ఆమె చెప్పినట్లు మహాభారతం శాంతి పర్వంలో ఉంది. లక్ష్మీదేవి తానెక్కడెక్కడ ఉంటానో స్వయంగా ఇంద్రుడికి చెప్పినట్లు అందులో ఉంది. ఆమె మాటలను తిక్కన సీసపద్యంలో ఇలా వర్ణించారు. అవే లక్ష్మీస్థానాలుగా పరిగణిస్తారు.
గురుభక్తి నిరతులు, సురపితృపూజన
పరులును, సత్యసంభాషణులును,
దానశీలురుఁ, బరధనపరదారప
రాఙ్ముఖచిత్తులు, బ్రాహ్మణప్రి
యులు, దివానిద్రావియుక్తులు, వృద్ధదు
ర్బలదీన యోషిత్కృపారతులును
శౌచులు, అతిథిభోజనశిష్టభోజులు
నేను మెచ్చు జనంబు; లిట్లుగాక
* ఎక్కడ గురుభక్తి కలవారుంటారో అక్కడ
* ఎక్కడ తల్లిదండ్రులను పూజించే వారుంటారో అక్కడ
* ఎక్కడ దానగుణం కలిగిన వారుంటారో అక్కడ
* ఎక్కడ ఇతరుల ధనం ఆశించని వారుంటారో అక్కడ
* ఎక్కడ బ్రాహ్మణులను ఆదరించే వారుంటారో అక్కడ
* ఎక్కడ పగటి పూట నిద్రించని వారుంటారో అక్కడ
* ఎక్కడ వృద్ధుల, దీనుల ఆదరణ  ఉంటుందో అక్కడ
* ఎక్కడ శుచీ, శుభ్రత ఉంటాయో అక్కడ
* ఎక్కడ అతిథి, అభ్యాగతుల సేవ జరుగుతుందో అక్కడ తానుంటానని... అలా ఉండేవారిని తాను అనుగ్రహిస్తానన్నది లక్ష్మీదేవి మాట.
అలాగే తన అనుగ్రహం పొందలేని వారి గురించి కూడా ఆమె చెప్పింది...
ధర్మ మెడలి, కామంబు క్రోధంబుఁ జాలఁ;
గలిగిగర్వులై బలియు భైక్షంబునిడక
పరుష వాక్కులఁ గ్రూరంపుఁ జరితములను।
మిగిలి వర్తించువారు నా మెచ్చుగారు
* ధర్మాలను పాటించని వారు
* కామక్రోధాలు ఎక్కువగా ఉన్నవారు
* గర్వం ఉన్నవారు
* పేదలకు భిక్ష, పూజా సామగ్రి ఇవ్వని వారు
* కఠినమైన మాటలాడేవారు
* క్రూర మనస్తత్వం ఉన్నవారు

శ్రావణ వంటలు - ఆరోగ్యప్రదాయము……

ఆషాఢ మాసము వెళ్ళిపోయి శ్రావణము వచ్చిందంటే మహిళలకు సందడే సందడి . వరలక్ష్మికి తొలిపూజ చేయడం ద్వారా తకము సౌభాగ్యము , ఐశ్వర్యము కలగాలని కోరుకుంటారు . అయిటే ఇందులో అంతర్లీనము గా ఆరోగ్య రహస్యము కూడా ఇమిడి ఉంది . వర్షాకాలము ప్రారంభం లో సాదారణము గా ప్రబలే పలు రకాల వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన రోగనిరోధక శక్తి ఈ వ్రతాల ద్వారా లభిస్తుంది . వరలక్ష్మీ పూజలో తొమ్మిది రకాల పిండివంటలు , ఈ ఋతువులో లభించే పండ్లు , వివిధ పుష్పాలు నివేదించి కుటుంబ సభ్యులంతా ప్రసాదం గా తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులవుతారు . ఇంకా కుటుంబ సభ్యులలో సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది . మహిళలు పేరంటం పేరుతో ఇరుగుపొరుగు వానిని ఆహ్వానించి పరస్పరము వెళ్ళి వాయినాలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా స్నేహభావము పెరుగుతుంది .



తొమ్మిది రకాల పిండివంటలు :-

పూర్ణం బూరెలు : సెనగపప్పుతో తయారు చేసిన ఈ బూరెలు తినడం ద్వారా ప్రోటీన్లు సమంద్దిగా లభిస్తాయి .
పులగం : బియ్యం , పెసరపప్పులను కలిపి తయారు చేస్తారు . గ్లాసుడు బియ్యంలో అరగ్లాసు పెసరపప్పు , తగినంత పంచదార , జీలకర్ర వేస్తారు .. ఇది భుజించడం ద్వారా మేధస్సు వికసిస్తుంది .
గారెలు : మినపపప్పు , కొద్దిగా సెనగపప్పు వేసి తయారు చేస్తారు . గారెలంటే అందరికీ ఇస్టము . ఇందులొ ఎన్నో ప్రోటీన్లు ఉన్నాయి .
పరమాన్నము : పాలను మరిగిస్తూ దానిలో నెయ్యి కలిపిన బియ్యాన్న, పంచదార .. వేయడం ద్వారా పరమాన్నము గా తయారవుతుంది . దీన్ని తినడం వల్ల కాల్షియం లభిస్తుంది .
చెక్కెర పొంగలి : బియ్యము , పాలు , నెయ్యి . పెసరపప్పు , జీడిపప్పు , కిస్ మిస్ , మిరియాలు వేసి తయారవుతుంది గాన మెదడు , ఇతర అవయవాలు చురుగా పనిచేసి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి .
పులిహోరా : బియ్యము , పసువు , జీడిపప్పు , వేరుసెనగ పప్పు , ఇంగువ వేసి తయారవుతుంది . దీనిని తినడం వల్ల శరీరము లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది .
చిట్టి బూరెలు : మునపపప్పు ముద్దగా చేసి కొద్దిగ మజ్జిగ కలిపి వేయించి చేస్తారు . ఇవి పిల్లలకు చాలా ఇస్టము . చలువ చేస్తుంది .
పెసర బూరెలు : పెసర పప్పుతో తయారు చేసిన ఈ బూరెలు లలో ప్రోటీన్లు లభిస్తాయి .
గోధుమ ప్రసాదము : గోధుమ నూక , పంచదార , నెయ్యి , మిశ్రమముతో తయారుచేస్తారు . ఇది బలమైన ఆహారము



Friday 27 July 2018

గురుపౌర్ణమి - వ్యాస పూర్ణిమ


                               గురుపౌర్ణమి


          మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది.
కాని చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ, దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల
దానిని గుర్తించ లేకపోతున్నాము. మన అజ్ఞానం ఎంతంటే? దీపం వెలిగించ మన్నప్పుడు నీటికీ , నూనెకు తేడా తెలియనట్టు వంటి చీకటి స్థితిలో ఉన్నాము. మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించు కోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం.


గురువు అంటే :-

గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని  గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చేయువారు అని అర్ధము. గు శబ్దమంధకారస్యరుతన్నిరోధకః అని పెద్దల వచనం!గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకు రావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం.

ఆ గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ,లోభ,మోహ, మద, మాత్సర్యాలు అనే దుర్గుణాలను, అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది. అప్పుడు ఆ పవిత్ర మైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది.

విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.

"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"

దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు.
"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్త కబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.


గురు పూర్ణిమ విశిష్టత :-

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ !
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !!

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !
నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!

ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.

గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.

సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిఅయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. మామూలు రోజులలో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా పొంద వచ్చట.. అందుకే ఈ రోజు గురుపూజోత్సవం లో పాల్గొని గురువు కరుణా కటాక్షములను పొందవచ్చు..

గురు అనే పదంలో ’గు’ అనే అక్షరం అంధకారాన్ని ’రు’ అనే అక్షరం వెలుగును సూచిస్తాయి..

ఙ్ఞానశక్తి సమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః ||

శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు.. కాబట్టి... గురువుకే ప్రథమ స్థానమునిచ్చారు.. మాతా, పిత, గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే...

అలానే ఈ రోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి..

నమోస్తుతే వ్యాస విశాల బుద్దే పుల్లార వి౦దాయత పత్రనేత్ర |
వినత్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమాయః ప్రదీపః ||

•  • •  • • •  • • • •  • • • • •  • • •

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ||
(’గురువును మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవు’)

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.

వ్యాస పూర్ణిమ :: గురుపూర్ణిమ


నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగం లోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపరయుగంలో2 పాదాలతో, ఈ కలియుగంలో 1 పాదంతో, నడుస్తుంది.
వసిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు
నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.

వ్యాసమహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపర యుగములోను ఒక సారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలో ని 28 వ యుగంలోని వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు కాలంలో.

ఇంతవరకు వ్యాసపీఠాన్నధిరోహించిన వ్యాసులు పేర్లు 1. స్వాయంభువ 2. ప్రజాపతి3. ఉశన 4. బృహశ్పతి 5. సవిత 6. మృత్యువు 7. ఇంద్ర 8. వశిష్ఠ 9. సారస్వత 10. త్రిధామ 11. త్రివృష 12. భరద్వాజ 13. అంతరిక్షక 14. ధర్ముడు 15. త్రయారుణ 16. ధనుంజయుడు 17. కృతంజయుడు 18. సంజయ 19. భరద్వాజ 20 గౌతమ 21. ఉత్తముడు 22. వాజశ్రవ 23. సోమశుష్మాయణ 24. ఋక్షుడు 25 శక్తి 26. పరాశరుడు 27. జాతూకర్ణి ప్రస్తుతం 28 వ వేదవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు.
ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ గా జరుపుకుంటాం. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది.

ఈరోజు  28 వ వేద వ్యాసుల వారి జయంతి. ఇతడు పరాశర మహర్షికి,మత్స్య గంధికి (సత్యవతి) కి కృష్ణ వర్ణం (నల్లని రంగు) తో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలవబడ్డాడు. పుట్టీ పుట్టగానే చేతిలో కమండలం,దండము చేతబట్టి  తపస్సు చేసుకోవటానికి వెళ్తానని తల్లి మత్ష్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు.

వ్యాస మహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే..  శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా.. వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు. వేదరాశి ని నిత్య కర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋక్-యజుర్-సామ-అధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు.ఆతర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా ...వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంధస్తం చేసాడు.అంతేకాక భాగవతాన్ని,అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు. సాక్షాతు శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవానుని గానూ ఆదిగురువుగానూ భావిస్తారు.


విష్ణు సహస్రనామ పీఠిక లో కూడా.....

"వ్యాసాయ విష్ణు రూపాయ-వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమ: !!

అని వ్యాసునికి విష్ణువుకు  అభేదం చెప్ప బడింది, వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి  పైలుడను శిష్యునకు ఋక్సంహితను, వైశంపాయనునకు యజుస్సంహితను, జైమినికి సామసంహితను, సుమంతునకు అధర్వణ సంహితను భోధించి వానిని లోకములో  వ్యాప్తి చేయండని ఆదేశించాడు.  వ్యాసుడు వేదాలని విభజించటమే కాకుండా అష్టా దశ పురాణాల్ని,ఉపపురాణాలను రచించాడు. బ్రహ్మసూత్రాల్ని వివరించాడు, భారత, భాగవతాలని రచించాడు. తాను గ్రంథస్థం చేసిన పురాణేతిహాసములను సూతునకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు.
వ్యాస భగవానుని అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తం అయ్యింది. సూత మహాముని ప్రథాన ప్రచారకుడై విషయములు బహుళ ప్రచారం చేసాడు.

స్మృతి కర్తలలో వ్యాసులవారు ఒకరు.  రెండధ్యాయముల ఈ గ్రంథానికి లఘు వ్యాస స్మృతి అని పేరు. ఇందులో మానవులకు ఉపయోగ పడే ఆచార విషయములు ఉన్నాయి. ఇదే వ్యాస సంహిత గా విఖ్యాతి పొందింది.

వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుని నుంచి వరాన్ని పొందాడు. ఆయనకు ఘృతాచి  అనే అప్సరస వలన బ్రహ్మ జ్ఞాని ఐన శుకుడు జన్మించాడు.

వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే, పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజమ్ వందే శుక తాతం తపోనిధిమ్ ||

తాత్పర్యం: వశిష్టుని మునిమనుమడైన కల్మష రహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన, శుకమహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనము.

" వ్యాసో నారాయణో హరిః " అన్నారు. వ్యాస భగవానులు సప్త చిరంజీవులలో ఒకరు.



మహాభారత రచన :-

మహాభారత రచనకు తనమనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే..... అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారూ అని విచారంలో ఉండగా..... బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి, అతని ఎదుట ప్రత్యక్షమయ్యి "వ్యాసా ! నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు." అని తెలిపి అద్రుశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా.... గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నీవు  వ్రాయాలి అని కోరాడు వ్యాసుడు. సరే అని ఒక షరతు పెట్టాడు గణేశుడు. నేను వ్రాసే ఘంటం ఆగకుండా నీవు చెప్పాలి. నా ఘంటం ఆగిన యెడల నేను వ్రాయను అని అన్నాడు. దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకొని నీవు వ్రాయాలి అని అన్నాడు.... ఈ నియమానికి అంగీకరించాడు గణపతి. ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే, నాలుగు వేదాల సారమైన పంచమవేదం అని మనం చెప్పుకొనే మహాభారతం అవతరించింది.

ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని, అంబాలికకు పాండు రాజుని, అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు.పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలుపొందాడు.కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది.
కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా.... అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.

వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వేలువడినదే వేదము. అందుకే అతనిని "వేదపురుషుడు" అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి--- మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏక రూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి, వేదాలను విభజిస్తాడు మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి, అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను, ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు.  


ప్రాచీన గాథలు, గత కల్పాలలో జరిగిన చరిత్రలు, సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా, ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు, చదవలేదు.అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.


పూజా విధానం (వ్యాస పూజ / గురు పూజా విధానం)...

కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు. శంకరులు, అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తారుట. బియ్యం, కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో, శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.

ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే, ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆది శంకరుని తమ గురువుగా ఎంచుకుంటారు. అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారన్న మాట! వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి.ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.

వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి.

శో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యవృతా వందే భగవంతౌ పునః పునః

అని పఠిస్తే బ్రహ్మత్వసిద్ధి కలుగును!


గురు సందేశము :-

వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది.

సర్వభూతముల యందు దయకలిగియుండుట, సత్యమార్గములో నడుచుట, శాంతగుణాన్ని కలిగియుండుట----ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేసారు.

మనందరికీ దేవరుణము, ఋషిరుణము, పితృఋణము---అని మూడు ఋణాలు ఉంటాయి. వీటితోపాటు వేదవ్యాసుడు మనుష్య ఋణము కూడా ఉంటుందని తెలియచెప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య ఋణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు.

ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరవాత తరాలకి అందించుట మన ధర్మం.

మన పిల్లలకు ఇతిహాస, పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతీసాంప్రదాయాల పట్ల, అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నయినా సాధించగలిగితే వ్యాసులవారి ఋణం కొంతయినా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాసభగవానుని కృపకు మనము పాత్రులము కాగలము అని ఆశిద్దాం. అందుకే గురుపూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం.